Monday, November 1, 2010

వీళ్లు మనకు అవసరమా?


"కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కానే కాదు..ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఇదివరకే అంగీకరించింది" అంటూ ఫైర్‌బ్రాండ్ రచయిత్రి అరుంధతీ రాయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కి హల్‌చల్ చేశారు. ఎవరేమనుకున్నా నేననుకున్నదే మాట్లాడుతాను అని చాలా సందర్భాల్లో చెప్పిన అరుంధతీరాయ్ తాజా వ్యాఖ్యలతో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. అన్నట్టు మర్చిపోయాను ఈ ఫైర్‌బ్రాండ్ రచయిత్రి మావోయిస్టులకు సానుభూతిపరురాలు కూడా. మావోయిస్టులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని...ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేసేందుకు కుట్రలు పన్నుతోందని..రాయ్ విరుచుకుపడటం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈ ఫైర్‌బ్రాండ్ లేడీకి ఎదురేలేదు. పార్లమెంట్ పై ఉగ్రవాదులు దాడి చేసినపుడు , ముంబయ్ లో కసబ్ అండ్ పార్టీ అమాయకులను ఊచకోత కోసినపుడు అరుంధతి రాయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే సృష్టించాయి. ప్రత్యేక కాశ్మీర్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసే అరుంధతి మావోయిస్టులను "గాంధేయవాదు"లంటారు. ఈ వ్యాఖ్య ఆమె ఏ ప్రతిపాదికన చేశారన్నది మన ఆలోచించకపోవడమే మంచిది. కాశ్మీరీలకు అన్యాయం జరిగిపోతుందని అరుంధతీ రాయ్ తెగ ఆవేదన చెందుతారు. భారత సార్వభౌమత్వాన్ని , ప్రజాసామ్యాన్ని గౌరవిస్తూ 80 శాతం మంది కాశ్మీరీలు ఓటింగ్ లో పాల్గొన్న విషయం ఈమెకు తెలియదా? సందర్భం వచ్చినప్పుడల్లా వారికి ప్రత్యేక కాశ్మీర్ ఇచ్చేయాల్సిందేనంటూ స్పీచ్‌లూ ఇస్తుంటారు. కాశ్మీర్లో భారత సైన్యం అత్యాచారాలు పెచ్చుమీరిపోయాయని , వారికి వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తారు. భారతదేశంలో అణిచివేత, వలసవాద , పెట్టుబడిదారీ వ్యవస్థలు వేళ్లూనుకున్నాయని ఈ దేశంలో ఎవరికీ స్వేచ్ఛా స్వతంత్రాలు లేవని , అందరి హక్కులను హరించివేస్తున్నారని అరుంధతీ రాయ్ ఆరోపిస్తుంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అర్థాన్నే మార్చేసిన అరుంధతీ రాయ్ మన దేశంలో హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాదంటారా? దేశంలో అంతర్భాగమైన ఒక ప్రాంతాన్ని అంతర్భాగం కాదంటూ మాట్లాడే మాటలు మన దేశంలో కాకుండా మిగతా దేశాల్లో చెల్లుబాటవుతాయా? మాతృభూమిని కాపాడుకునేందుకు అహోరాత్రులు ప్రాణాలను పణంగా పెట్టి కాపాలా కాస్తున్న సైనికులను అపహాస్యం చేసే ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూస్తూ ప్రచారం కోసం అర్థంలేని వ్యాఖ్యలు చేసే అరుంధతీ రాయ్ లాంటి వారు దేశానికి చేసిన సేవలేమిటి ? ప్రచారమే పరమావధిగా నోటికొచ్చినట్టే మాట్లాడే ఇటువంటి వారు మన వ్యవస్థకు అవసరమా? చిన్నపిల్లలనే కనికరం లేకుండా పిచ్చెక్కిన కుక్కల్లా ముంబయ్ లో మారణహోమం సృష్టించిన తీవ్రవాదులను వారి దాడులను ఖండించాల్సిన సమయంలోనూ సమస్యకు మూలకారణం వెతకాలనే ఈ అతి తెలివి మేధావులను మనం భరించాలంటారా? మావోయిస్టులను అణిచివేస్తున్నారంటూ గొంతు చించుకునే అరుంధతీ రాయ్ వారు సామాన్యులను ఊచకోత కోసినపుడు ఎక్కడ ఉన్నారు ? పోలీసుల చేతిలో మావోయిస్టులు మరిణిస్తే గగ్గోలు పెట్టే మానవ హక్కుల సంఘాల నేతలు మావోయిస్టుల చేతిలో పోలీసులు మరణిస్తే మాత్రం ఉలకరు పలకరు. అటువంటి ఏకపక్ష మానవ హక్కుల సంఘాల నేతలు ఈ ఫైర్‌బ్రాండ్ రచయిత్రి వెంట తిరుగుతూ ఆమె తలతిక్క మాటలకు వంత పాడుతూ ఉంటారు. అవినీతి రాజకీయ నాయకులతో సమానంగా వీరు కూడా మన దేశ పరువును మంటగలపుతూ ...పైపెచ్చు ఏదో దేశ సేవ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తుంటారు. వీరి వలన దేశానికి కలిగిన ప్రయోజనం ఒక్కటైన ఉందా?...నష్టం తప్ప. కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదన్న అరుంధతీ రాయ్, తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై జాలి పడుతున్నట్టు ప్రకటించారు. ఆమే కాదు నేను కూడా జాలి పడుతున్నాను... వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా పట్టించుకున్న వారు లేరు... మీడియా కవరేజీ లేదు.. అనవసర ప్రచారం ఎందుకని ప్రభుత్వం కూడా రాజద్రోహం కేసు పెట్టలేదు..పైపైచ్చు పిచ్చివారి మాటలను పట్టించోవద్దంటూ లక్షల కొద్దీ మేసేజ్ లు దేశవ్యాప్తంగా హల్‌చల్ చేశాయి. మరి ఇటువంటి వారిపై జాలి పడక ఏం చేస్తాం చెప్పండి.

Thursday, September 23, 2010

"కామన్‌"వెల్త్ భాగోతం


అస్తవ్యస్థ వ్యవస్థ.... అసమర్థ నిర్వహణ.... అందినకాడికి దోపిడీ.....
వెరసి వందకోట్ల మంది పరువు మురికి కుంటలో మునక. కామన్‌వెల్త్ క్రీడల ఏర్పాట్లను చూస్తే ఇప్పుడు సామాన్యుని గుండె తరుక్కుపోతోంది. క్రీడలు మన ప్రతిష్టను పెంచుతాయని గప్పాలు కొట్టిన మన నేతలు....ప్రతిష్టను పెంచడం మాట అటుంచి ఉన్న ప్రతిష్టను న్యూఢిల్లీ వీధుల్లో వేలం వేస్తున్నారు. మన సన్నద్ధతను చూసి విదేశీయులు లోలోపల నవ్వుకుంటున్నారు. ఈ వెటకారపు నవ్వును సిగ్గు లేని రాజకీయ నాయకులు జీర్ణించుకోగలరేమో కానీ నిజమైన భారతీయుడు సహించలేడు. నిలువెల్లా అవినీతి, లంచగొండితనం జీర్ణించుకుపోయిన మన వృద్ధ రాజకీయ నాయకులకు మాత్రం ఇది చిన్న విషయంగా తోస్తోంది. వరుస ఘటనలు జరుగుతున్నా , స్టేడియాలు, నిర్మాణాలు పేకమేడల్లా కూలుతున్నా ఇవన్నీ కామన్ అంటూ చచ్చు వెధవలంతా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాకేయడమే అలవాటుగా మార్చుకున్న మన పాలకులకు ఇటువంటి ప్రతిష్టాత్మక విషయంలోనూ చేతి దురద ఆగకపోవడం మన వ్యవస్త దుస్థితిని కళ్లకు కడుతోంది. క్రీడల నిర్వహణకు ప్రారంభంలో కొట్టిన కొబ్బరికాయను 100 రూపాయలు పెట్టి కొన్న కామన్‌వెల్త్ క్రీడల అధికారులు ఇప్పటికీ అదే తీరున ప్రతీ వస్తువును కొనుగోలు చేస్తున్నారు. జనాల సొమ్మును ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసిన, మన భకాసురులు నాణ్యతను, నమ్మకాన్ని గాలికొదిలేశారు. ఫలితం గట్టిగా గాలివీస్తే కూలిపోయే స్టేడియాలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు. స్టేడియాలు నెత్తిన పడతాయని భయపడ్డారేమో... కొందరు విదేశీ క్రీడాకారులు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. స్టేడియాలకు కూలిపోతాయేమోనని భయపడని మరికొందరు గట్టి గుండె క్రీడాకారులు దోమల దెబ్బకు జడుసుకుంటున్నారు. స్టేడియంలోకి బాంబులు తీసుకెళ్లినా పసిగట్టలేని మన పోలీసులు మాత్రం అది మీడియావాళ్ల అతి అంటూ ఆడలేక మద్దెల మీదకు తప్పును నెడుతున్నారు. మనవాళ్ల నిర్వాకాలు చూసి ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారులు కామన్వెల్త్స్ కు డుమ్మా కొట్టగా ఇప్పుడు ద్వితీయ శ్రేణి క్రీడాకారులు కూడా పారిపోవడానికి దారులు వెతుక్కుంటున్నారు. న్యూఢిల్లీ కామన్వెల్త్స్ లో ఆడాలో వద్దో క్రీడాకారులే నిర్ణయించుకోవాలంటూ ఇప్పటికే కొన్ని దేశాలు సరికొత్త పల్లవిని అందుకుంటున్నాయి. తాజాగా ఒలింపిక్స్ ను ఘనంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్న చైనా లానే ఇండియా కూడా ఒలింపిక్స్ నిర్వహించగల సామర్థ్యం ఉన్నదని మొన్న ఎవరో ప్రముఖ వ్యక్తి చెప్పాడు. దయచేసి ఆ వ్యక్తి కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతే మంచిదేమో. మనం ఒలింపిక్స్ ను నిర్వహించగలం.... ఎప్పుడంటే మన రాజకీయ నాయకులను, అవినీతి అధికారులను ఎర్రకోట దగ్గర వరుసగా నిలబెట్టి ఏ.కే.47 తో కాల్చి చంపినపుడు... లక్షల కోట్లు పోయాయి.....పరువు పోయింది....ప్రతిష్ట మంటకలిసింది... కడుపు మండిపోతోంది.

Saturday, September 4, 2010

కార్పోరేట్ జర్నలిస్ట్ ఆత్మఘోష!


నీవు నడుస్తున్న శవానివి!
నిజాన్ని భాగ్యానికి అమ్ముకున్న అభాగ్య వేతనజీవివి!
సమాజాన్ని మార్చేస్తానన్న నీ ఆవేశ కావేశాలను పాతిపెట్టేసి...
విలువలకు ఉప్పు పాతరేసిన బతికున్న శవానివి!
అన్యాయంపై గొంతెత్తే నీ ధిక్కార స్వరమేదీ?
అక్రమాలను చీల్చి చెండాదే నీ ప్రచండ కలమేదీ?
దోపిడీపై మాటల తూటాలు పేల్చే నీ గొంతెందుకు మూగబోయింది?
ప్రశ్నించడం మానేసిన రోజు చచ్చిపోయిన నువ్వు శవంగానే బాగున్నావ్!

Friday, July 30, 2010

ఏందిరా మీ గోల!


ఒకరు గనులంటారు
మరొకరు మణులంటారు
ఒకడు మీరు దొంగలంటాడు
మరొకడు మీరే గజదొంగలంటాడు
వాడేమో మీ పాలనలో జనానికి మిగిలింగి కన్నీళ్లే అంటాడు
వీడేమో ఆపండి మీ మొసలి కన్నీళ్లు అంటాడు
అసలు ఇంతకీ ఎవరు దొంగలు?ఎవరు దొరలు?
ఎవరు మహానుభావులు?ఎవరు దద్దమ్మలు?
సిబీఐ ఎంక్వయిరీ వేసి మీ ఇద్దరిలో ఎవరు వాజమ్మలో తేలుద్దామంటారా?
మీడియా ముసుగులో గుద్దుకుంటున్న మీ ఇద్దరిలో ఏవరు దొంగలో ఎవరు దొరలో దేవుడికెరుక కానీ....
మీ పేపర్లు చదువుతూ మీ ఛానెళ్లు చూస్తున్న తెలుగు ప్రజల సహనానికి ఈ బక్కోడు బోర్లాపడి మొక్కుతున్నాడు....

(సొంత జెండా, ఎజెండాల వార్తలతో నిండిపోయే ఈ దగుల్బాజీ పేపర్లను నేనైతే చదవడం మానుకున్నాను)

Wednesday, July 28, 2010

నేను


నేను .......
తరచి చూస్తే స్వార్థానికి ప్రతీకల్లా లేవూ ఈ రెండక్షరాలూ!
కానీ నేను స్వార్థపరుడ్నే అని ఒప్పుకునేందుకు ఎందుకో అహం అడ్డొస్తోంది!
ఏమో.... ఎందుకో...నాకే తెలియదు...
అవును నేను నిజంగా స్వార్థపరుడ్నేనా?
జనాన్ని తోసుకుంటూ బస్సు ఎక్కేస్తాను....సీటు సంపాదించేస్తాను...
సంతృప్తితో కునుకు తీస్తాను,బస్సులో ఎంతోమంది నిలబడలేక ఇబ్బందులు పడుతున్నా!
ఇదేనా స్వార్ధం అంటే...
కానీ "నేను" ఎంతో కష్టపడి సీటు సంపాదించుకున్నాను కదా?
అదుగో మళ్లీ "నేను"!
నా "మనస్సాక్షి"కి ఆ "నేను"కి నిరంతం జరిగే ఈ సంఘర్షణ ఎన్నటికి ముగిసెనో!

ఆంధ్ర భోజునికి ఆత్మక్షోభ!


శ్రీకాళహస్తి రాజగోపురం కూలిపోయింది....
కాదు కుప్పకూల్చేశారు...
వందల ఏళ్ల చరిత్రను నేల మట్టం చేశారు.....
నిర్మించడం చేతగాని చేవలేని పాలకులు మన చరిత్రను మట్టిలో కలిపేశారు....
ఏడుద్దామా? బాధపడదామా? ఏం చేద్దాం...ఇప్పుడేం చేద్దాం...
రెండు రోజులు ఏడ్చి అలవాటుగా దీన్ని కూడా మర్చిపోదామా! వద్దు......
కళ్లు తెరుద్దాం....మన సంస్కృతిని,చరిత్రను కాపాడుకుందాం....
మైనారిటీలకు మక్కా, జెరూసలేం టిక్కెట్లు కొనిచ్చే మన ప్రభుత్వాలను....
దేవాలయాల పోషణపై శీతకన్ను ఎందుకని అడుగుదాం.....
వంకర సమాధానాలు చెప్పే "గాదె" కింది పందికొక్కుల పంచె ఊడేలా తరిమికొడదాం.....
రండి....ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు భారతమాత రుణాన్ని తీర్చుకుందాం...
మన దేవాలయాల వైశిష్ట్యాన్ని కాపాడుకుందాం....మన భావితరాలకు భద్రంగా అందిద్దాం....
శ్రీకృష్ణదేవరాయల ఆత్మక్షోభను తగ్గిద్దాం....
రండి అడుగు ముందుకేయండి.....దేవాలయాల పరిరక్షణకు నడుంబిగించండి...
నిజమైన భారతీయులనిపించుకోండి! జైహింద్.

Wednesday, April 21, 2010

మనిషివా?జర్నలిస్టువా?


విలువల వలువలు విడిచిన
జర్నలిజం నడిరోడ్డుపై
నిలిచింది నగ్నంగా....
సొంత లాభం , స్వంత ప్రయోజనాలు, స్వప్రయోజనాలే
పరమావధినేటి కార్పోరేట్ జర్నలిజానికి...
సెక్స్, క్రైం, టీఆర్‌పీలు
ఇవినా పిల్లలు కాదంటూ ఆక్రోషిస్తోంది నిప్పులాంటి నిజం......
"జ్యోతి"ప్రజ్వలన చేసి నిజాన్ని
కాపాడుతామంటూ"'సాక్షి"సంతకాలు చేసిన వారు "ఈనాడు"లేరు.....
విలువలు లేని నేటి కార్పోరేట్ కలం ఏజెంట్ కు
తాజా పేరు "మనిషివా"? "జర్నలిస్టువా?"
తెగబలిసిన పెట్టుబడిదారీ చెదపురుగులు
తొలిచి పారేస్తున్నాయి "నాలుగో స్తంభాన్ని"